కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని పుణే జిల్లా లోనావాలో వర్షాలు (Maharashtra Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో ఇక్కడ రికార్డు స్థాయిలో 67 సెంటీమీటర్ల (670 మిల్లీమీటర్లు) భారీ వర్షపాతం నమోదైంది. లోనావాతో పాటు భిరా, తంహిని, షిర్గాన్, అంబోన్, ఖోపోలి వంటి పరిసర ప్రాంతాల్లో కూడా వానలు దంచికొడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 500 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
లోనావా పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న ఈ భారీ వర్షపు నీరంతా ప్రస్తుతం ఉధృతంగా భీమా నదిలోకి చేరుతోంది. ఈ వరద ప్రవాహం జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కృష్ణా నదిలో కలవనుంది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

