కలం, వెబ్ డెస్క్ : ప్రపంచంలోని వింతల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్ (Taj Mahal) ప్రాంగణం లోపల ‘తేజో మహాలయ’ (అగ్రేశ్వర్ మహాదేవ్ నగ్నథేశ్వర్ విరాజమాన్) ఆలయం ఉందని అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. తాజ్ మహల్ కంటే ముందే ఆ ప్రదేశంలో ‘తేజో మహాలయ’ అనే శివాలయం ఉండేదని , ఈ విషయంపై నిజానిజాలను వెలికితీయడానికి అడ్వొకేట్ కమిషనర్ ను నియమించాలని హరి శంకర్ జైన్తో పాటు మరో నలుగురు దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే తాజ్ మహల్ కట్టడం యొక్క వాస్తవ నిర్మాణ శైలిని, అంతర్గత లక్షణాలను రికార్డు చేయాల్సి ఉంటుందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం కేంద్రానికి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. వివాదాస్పద ప్రాంగణంలో సర్వే, ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ కోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించే అంశంపై తమ అభిప్రాయాన్ని తెలుపుతూ మరో పిటిషన్ దాఖలు చేయాలని కేంద్రానికి , సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు నోటీసులు పంపింది.

