కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా బచ్చన్నపేట మండలంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి,, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయి సీజ్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, డీసీపీ వెస్ట్ జోన్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం, మహారాష్ట్రకు చెందిన రాహుల్ ఆకలేకర్ ఉపాధి నిమిత్తం జనగామ జిల్లాకు వచ్చాడు. బచ్చన్నపేట మండలంలోని ఓ గ్రామంలో బొమ్మల తయారీ సంస్థలో బండార్గా పనిచేస్తున్నాడు. అయితే సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుంచి గంజాయిని కొనుగోలుచేసి బస్సులో హైదరాబాద్కు తీసుకువచ్చాడు.
అనంతరం మరో బస్సులో బచ్చన్నపేటకు తరలిస్తుండగా ప్రత్యేక నిఘా బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం-1985 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

