కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్నగర్ జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ జానకి కీలక సూచనలు చేశారు. ఫిర్యాదుల స్వీకరణ, దర్యాప్తులో జాప్యం ఉండొద్దని ఆదేశించారు. సోమవారం ఆమె మహబూబ్నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిశీలించారు. కుటుంబవివాదాలు, భూ సమస్యలు, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలు, ఇతర అంశాలకు సంబంధించిన పలువురు బాధితుల వినతులను విని సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
సమస్యలను పరిష్కరించడం పోలీసుల బాధ్యత
ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం పోలీస్శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారించి చట్టపరమైన చర్యల ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి అధికారి ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, వృద్ధులు సైబర్ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.

