కలం, మెదక్ బ్యూరో: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ మున్సిపాలిటీ (Husnabad Municipality)కి 2026 సంవత్సరానికి గాను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి “ఉత్తమ పర్యావరణ పని తీరు పురస్కారం” లభించింది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం హుస్నాబాద్, సూర్యాపేట మున్సిపాలిటీలు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాయి. హుస్నాబాద్ మున్సిపాలిటీ వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య పరిరక్షణ, హరితాభివృద్ధి, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రజలకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా హుస్నాబాద్ను పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శ మున్సిపాలిటీగా నిలిపేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

