కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో పోలీసులు సోమవారం ఉదయం నుంచి విస్తృత స్థాయిలో మెరుపు సోదాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఒకేసారి వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్ చిట్టీల నిర్వాహకుల ఇళ్లతో పాటు కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. పోలీసుల బృందాలు ఏకకాలంలో రంగంలోకి దిగడంతో జిల్లాలో కలకలం రేగింది.
సోదాల సందర్భంగా వడ్డీ వ్యాపారానికి సంబంధించిన రికార్డులు, ఖాతా పుస్తకాలు, ప్రామిసరీ నోట్లు, నగదు లావాదేవీల వివరాలు, చిట్టీల నిర్వహణకు సంబంధించిన పత్రాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. చట్టబద్ధ అనుమతులు లేకుండా చిట్టీలు నిర్వహిస్తున్నారా, అధిక వడ్డీ వసూలు చేస్తున్నారా, ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
అలాగే అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, అక్రమంగా నగదు చలామణి, ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అవసరమైతే సంబంధిత వ్యక్తులను విచారించి, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ సోదాల్లో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఏమైనా నగదు లేదా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారా అనే విషయాలపై పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Read Also: జనసేనానికి వినూత్న కానుక.. అటవీ సంపదతో ఎంపీ పరామర్శ!
Follow Us On: Instagram

