కలం, వెబ్డెస్క్: ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను పరామర్శించేందుకు అడవే తరలివచ్చినట్లయ్యింది. కొద్ది రోజులుగా పవన్ను పరామర్శించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సహా జనసేన నేతలు ఆయనను కలిశారు. తాజాగా జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (MP Uday Srinivas) పవన్ను కలిసేందుకు ఆయన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తీసుకొచ్చిన ఓ కానుక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉదయ్ శ్రీనివాస్ అడవిలో దొరికే పండ్లు, ఫలాలతో ఓ బొకే తయారు చేసి అందులో ఓ ఎమోషనల్ మెసేజ్తో బహుమతి అందించి పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పంచాయతీరాజ్ శాఖతో పాటు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడవిని, ప్రకృతిని ప్రస్తావిస్తూ పవన్ కోసం ఉదయ్ శ్రీనివాస్ ఓ సందేశాన్ని రాసుకొచ్చారు. “అడవులు సైతం నిశ్శబ్దంగా ఉండి మీరు తిరిగి లేచే క్షణం కోసం ఎదురుచూస్తున్నాయి, అడవి జీవాలు సైతం ఆగి.. మీరు ఎందుకు ఇంకా విశ్రాంతిలో ఉన్నారు? అని అడుగుతున్నట్లుంది. ఓ నాయకుడా.. మీ శక్తి తిరిగి వచ్చే వరకు విశ్రాంతి తీసుకోండి.. ఎందుకంటే ప్రతి పొలం, ప్రతి హృదయం, ప్రతి ఇల్లు.. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాయి. జనసేన దీపం ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. మీరు త్వరగా కోలుకొని మళ్లీ మా మధ్యకు వచ్చి వెలుగులు పంచాలని ఆకాంక్షిస్తున్నాం” అని తన సందేశంలో పేర్కొన్నారు.
Read Also: ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. మరో రెండు కేసులు!
Follow Us On : WhatsApp

