కలం, వరంగల్ : మాజీ మంత్రి కొండా సురేఖకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి గెలవాలని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య (Baswaraj Saraiah) సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం వరంగల్లో మీడియాతో మాట్లాడిన సారయ్య.. కొండా సురేఖ రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే తాను కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.
అప్పుడు ఎవరి సత్తా, ఎవరి దమ్ము ఎంతో ప్రజలే తేలుస్తారని అన్నారు. పార్టీలో ఉంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం సరికాదని సారయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో గందరగోళం సృష్టించేలా వ్యవహరించడాన్ని సహించేది లేదన్నారు. పార్టీ క్రమశిక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. కొండా కుటుంబం రాజకీయంగా తమ బలాన్ని నిరూపించుకోవాలంటే పదవులకు రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో పోటీ చేయాలని సారయ్య సవాల్ చేశారు. వరంగల్ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

