కలం, వరంగల్ బ్యూరో: నగరాల్లో ఫంక్షన్ హాళ్లలో (Function Hall) జరిగే వేడుకలకు గుర్తు తెలియని వ్యక్తులు రావడం, కడుపు నిండా భోజనం చేసి వెళ్లడం కామన్. చిన్న చిన్న ఫంక్షన్ హాళ్లలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాగే కొంతమంది ఫంక్షన్లకు వచ్చి దొంగతనాలకు కూడా పాల్పడుతుంటారు. హడావిడిలో ఎవరు వస్తున్నారు, ఎవరు తింటున్నారు, ఏం చేస్తున్నారన్న దానిపై ఎవరూ అంతగా దృష్టి పెట్టరు. ఇలాంటివి కట్టడి చేసేందుకు మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఫంక్షన్ జరుగుతున్నప్పుడు సంబంధం లేని వ్యక్తులు దొరికితే సెక్షన్ 441 ప్రకారం 3 నెలలు జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తామని ఓ హెచ్చరిక బోర్డును ఫంక్షన్ హాల్ ముందు ఏర్పాటు చేసింది. ఆ బోర్డును చూసి కొందరు నవ్వుకుంటుండగా మరికొందరు భలే పని చేశారంటూ చర్చించుకుంటున్నారు.
ఏమిటీ సెక్షన్ 441..?
భారత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 441 ప్రకారం ఎవరైనా అనుమతి లేకుండా ఇతరుల స్థలంలోకి ప్రవేశించరాదు. అలా వస్తే దానిని క్రిమినల్ ట్రెస్ పాస్ (నేర ప్రవేశం)గా పరిగణిస్తారు. ఈ సెక్షన్ కింద స్థల యజమాని ట్రెస్ పాస్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేస్తే శిక్ష విధించవచ్చు. 3 నెలలు జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తారు. ఒక్కోసారి ఏడాది జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి.
Read Also: డైనోసార్ గుడ్లు లభ్యం.. ఎన్నేళ్ల క్రితం నాటివి అంటే..
Follow Us On: Facebook

