కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా మధిర మండలానికి సమీపంలోని ఆతూరులో గల సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీ (Cold Storage)లో శనివారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై స్థానిక కాంగ్రెస్ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సమాచారం అందించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మధిర – వైరా రహదారిలో ఉన్న సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో జరిగిన ఈ ప్రమాదంలో రూ. 25 కోట్ల విలువైన మిర్చి పంట బుగ్గిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీలో దాదాపు 300 మంది రైతులకు సంబంధించిన 28 వేల మిర్చి బస్తాలను నిల్వ ఉంచినట్లు సమాచారం. కాగా, ఆదివారం డిప్యూటీ సీఎం ఖమ్మం (Khammam) పర్యటన సందర్భంగా ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

