కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన మాచర్ల పరువు హత్య కేసు (Macherla Honor Killing Case)లో మాచర్ల సీఐ వెంకటరమణ (SI Venkataramana)ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ హత్యలో తల్లిదండ్రులతో పాటు సీఐ పాత్ర కూడా ఉందని వెల్లడవడటంతో ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తాజాగా వెంకటరమణను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. ప్రేమ వివాహం చేసుకున్న యువతి చౌడేశ్వరిని గతనెల 15న బలవంతంగా తల్లిదండ్రులకు సీఐ అప్పగించినట్లు నిర్ధారణ అయింది. సదరు యువతి మేజర్ అయినప్పటికీ బెదిరించి తల్లిదండ్రులకు సీఐ అప్పగించారు. చౌడేశ్వరి తల్లిదండ్రుల నుంచి సీఐ భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. గత నెల 4న ఇంట్లో నుంచి వెళ్లిపోయి తాను ప్రేమించిన వ్యక్తినిపెళ్లి చేసుకొని జీవితాంతం అతడితో ఉండాలని నిర్ణయం తీసుకున్న యువతి ఆశలపై నీళ్లు చల్లుతూ.. తల్లిదండ్రలు, సీఐ చేసిన నిర్వాకంతో చౌడేశ్వరి ఈ లోకంలోనే లేకుండా పోయింది.
చౌడేశ్వరి చనిపోయాక.. ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు నమ్మబలికారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య ఆనవాళ్లు లేవని వైద్యులు తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది. పలు ఆధారాలతో అనుమానం వచ్చి విచారణ చేస్తే తల్లిదండ్రులు నేరం ఒప్పుకున్నారు. ఆత్మహత్యగా చిత్రీకరించడంలోనూ పోలీసు అధికారి పాత్ర ఉన్నట్లు నిర్ధరించారు. పోస్టుమార్టం రిపోర్ట్, ఆత్మహత్యకు పొంతన కుదరకపోవడంతో పోలీసు అధికారి అరాచకం బయటపడింది. న్యాయవ్యవస్థను గౌరవిస్తూ ప్రభుత్వ ఆదేశాలను తు.చా. తప్పకుండా పనిచేసే పోలీసు అధికారే.. ఇలాంటి నీతిమాలిన పని చేయడం పట్ల ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

