కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావం ఇప్పుడు హైదరాబాద్లోని ప్రముఖ హోటళ్లపై పడుతోంది. అంతర్జాతీయంగా తలెత్తిన ఉద్రిక్తతల వల్ల ఎల్పిజి గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లో అనేక రెస్టారెంట్లు మూతపడుతుండగా, హైదరాబాద్లోని ప్రసిద్ధ షా గౌస్ (Shah Ghouse) హోటల్ మాత్రం వినియోగదారుల కోసం ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది.
ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో బిర్యానీకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో హోటల్ను మూసివేయడం సాధ్యం కాకపోవడంతో, షా గౌస్ (Shah Ghouse) యాజమాన్యం గ్యాస్ స్టవ్లకు బదులుగా సంప్రదాయ కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తోంది. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, పవిత్ర మాసంలో భోజన ప్రియులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కట్టెల పొయ్యిపై వండటం వల్ల బిర్యానీకి మరింత రుచి వస్తోందని కొందరు అభిప్రాయపడుతుండగా, యుద్ధ పరిణామాలు వ్యాపారాలపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో ఈ పరిస్థితి తెలియజేస్తోంది.

