కలం, వెబ్ డెస్క్: హార్ముజ్ జలసంధి తీరప్రాంతంలోని ఇరాన్ (Iran) భూగర్భ సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు భారీ దాడులు చేపట్టాయి.ఇప్పటి వరకు ఉపయోగించని, అత్యంత శక్తివంతమైన 5,000 పౌండ్ల ‘డీప్ పెనెట్రేటర్’ బాంబులను ప్రయోగించాయి. భూగర్భంలో పటిష్టంగా నిర్మించిన ఇరాన్ క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా మారిన ఇరాన్ యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులను లక్ష్యంగా చేసుకొని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది.
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఈ క్షిపణి కేంద్రాల వల్ల ప్రమాదం పొంచి ఉందని అమెరికా పేర్కొంది. ఈ ముప్పును తొలగించేందుకే ఈ దాడులు నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ దాడులతో ఇరాన్ తీరప్రాంతంలోని కీలక క్షిపణి వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. అమెరికా ప్రయోగించిన బాంబులు భూగర్భంలోకి చీల్చుకొని వెళ్లి ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

