కలం, వెబ్ డెస్క్ : దేశంలోని గృహ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. ఇళ్లలో వంట అవసరాల కోసం ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinder) ధరను భారీగా పెంచుతూ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాజా నిర్ణయంతో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరపై ఒకేసారి రూ.29 మేర అదనపు భారం పడింది. పెరిగిన ఈ కొత్త ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.
గడిచిన మూడు నెలల కాలంలోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇంతకుముందు మార్చి 7వ తేదీన చమురు సంస్థలు సిలిండర్పై రూ.60 మేర ధరను పెంచాయి. ఆ భారం నుంచి సామాన్యుడు కోలుకోకముందే ఇప్పుడు మరోసారి ధరలను సవరించాయి. తాజా పెంపుతో ఇప్పటివరకు రూ.936 గా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర కాస్తా రూ.965 కు చేరుకుంది. వరుసగా పెరుగుతున్న వంటగ్యాస్ ధరలు మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

