కలం, వెబ్ డెస్క్ : ఏపీలోకి శనివారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఆదివారం విభిన్న వాతావరణ (AP Weather) పరిస్థితులు కనిపించనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండ ప్రభావం, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పిడుగులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. అయితే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేసింది.

