కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ – మల్కాజ్గిరి (Medchal Malkajgiri) జిల్లా కాప్రా ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న ఫాస్ట్ఫుడ్ సెంటర్లో ఎల్పీజీ సిలిండర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో సెంటర్లో మంటలు చెలరేగి పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పేలుడు తీవ్రతకు ఫాస్ట్ఫుడ్ సెంటర్లో భారీ మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

