కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ(Hanumakonda) నగరంలోని అంబేద్కర్ జంక్షన్లో ఉన్న కాకతీయ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద బుధవారం రాత్రి పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు భారీగా బారులు తీరారు. పలు పెట్రోల్ బంకులలో ఉదయం నుంచే ‘నో స్టాక్’(No Stock) బోర్డులు పెట్టారన్న వదంతులు సోషల్ మీడియాలో వ్యాపించడంతో, వాహనదారులు ముందస్తుగా ఇంధనం నింపుకునేందుకు పెద్ద ఎత్తున బంకుల వద్దకు చేరుకున్నారు.
దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి, బంకుల వద్ద పొడవైన క్యూలు కనిపించాయి. అయితే, ఈ వదంతుల్లో ఎలాంటి నిజం లేదని బంక్ నిర్వాహకులు స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడా ఇంధన కొరత లేదని, సరఫరా సజావుగా కొనసాగుతోందని తెలిపారు. అనవసరంగా భయపడకుండా, ఇంధనాన్ని పొదుపుగా వినియోగించాలని వాహనదారులకు సూచించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని కోరారు.

