కలం, తెలంగాణ బ్యూరో : ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న బ్లాక్ మార్కెటీర్లపై ప్రభుత్వం ఆకస్మిక సోదాలు చేస్తూ కట్టడి చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వంట గ్యాస్ సిలిండర్ల మాయాజాలంపై (Black Market LPG) పౌరసరఫరాల శాఖ సీరియస్ దృష్టి పెట్టింది. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ పేరుతో గ్యాస్ డీలర్లు, గోడౌన్లలో సోదాలు నిర్వహించింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న డీలర్లపై చర్యలు తీసుకుంటున్నది. ఇరాన్లో యుద్ధం మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత నెలకొనడంతో సరఫరాలో చిక్కుల్లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణా చర్యలు మొదలుపెట్టాయి. అందులో భాగంగా దొడ్డిదారిన ఎక్కువ ధరకు అమ్మకుండా నిఘాను ముమ్మరం చేసింది. ఆ ప్రకారం ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్లవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన డీలర్లపై కేసులు నమోదు చేసింది.
రెండు వారాల్లో 1473 కేసులు నమోదు :
ప్రజలు ఎదుర్కొంటున్న వంట గ్యాస్ సిలిండర్ల డెలివరీల్లోని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న పౌర సరఫరాల కార్పొరేషన్ పలు గోడౌన్లను తనిఖీ చేసింది. ఈ నెల 12 నుంచి 25వ తేదీ వరకు జరిపిన సోదాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. దీంతో నిత్యావసరాల చట్టంలోని సెక్షన్ 6-1, 7 ప్రకారం మొత్తం 1,473 కేసులను నమోదు చేసింది. మొత్తం 175 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ సోదాల్లో అధికారులు, సిబ్బంది కలిపి 2,952 డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను, 70 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసులవారీగా చూస్తే సెక్షన్ 6-ఏ ప్రకారం 1,275 కేసులు, ఇతర సెక్షన్ల కింద 237 కేసులను నమోదు చేశారు. స్వాధీనమైన సిలిండర్లు, ఇతరాల విలువ సుమారు రూ. 88.56 లక్షలుగా సివిల్ సప్లైస్ అధికారులు పేర్కొన్నారు.
Read Also: అమెరికా – ఇరాన్ వార్.. పాక్ పై జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు!
Follow Us On: Instagram

