కలం, వెబ్ డెస్క్: వైట్హౌస్లో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi) సందడి చేశారు. 2025 MLS కప్ ఛాంపియన్షిప్ గెలిచిన ఇంటర్ మయామి జట్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ట్రంప్.. మియామీ జట్టుపై ప్రశంసలు కురిపించారు. గతంలో పీలే ఆటను తాను చూశానని, అయితే మెస్సీ అంతకంటే గొప్పగా ఆడుతున్నాడని కొనియాడారు. చాలా మంది ఆటగాళ్లు వస్తుంటారు కానీ అందరూ గెలవలేరని, మెస్సీ మాత్రం జట్టులోకి వచ్చి గెలిచి చూపించాడని కొనియాడారు. గతంలో బైడెన్ ఆహ్వానాన్ని మెస్సీ మన్నించని విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తూ, మెస్సీకి వైట్హౌస్లో స్వాగతం పలికే అవకాశం దక్కిన తొలి అధ్యక్షుడిని తానేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇంటర్ మయామి జట్టు 2025లో సాధించిన చారిత్రాత్మక విజయాలను ట్రంప్ వివరించారు. MLS కప్ ఫైనల్తో పాటు, క్లబ్ వరల్డ్ కప్లో పోర్చుగీస్ జట్టు ‘పోర్టో’ను ఓడించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక యూరోపియన్ జట్టును అధికారిక పోటీలో ఓడించిన తొలి ఉత్తర అమెరికా జట్టుగా మయామి రికార్డు సృష్టించిందన్నారు. జట్టు సభ్యులు ట్రంప్కు ’47’ నంబర్ గల తమ సిగ్నేచర్ పింక్ జెర్సీని బహుకరించారు. జట్టు యజమాని జార్జ్ మాస్ మాట్లాడుతూ.. కష్టపడితే ఏదైనా సాధ్యమని తమ జట్టు నిరూపించిందని, అమెరికాలో ఫుట్బాల్ సంస్కృతిని ఈ ఆటగాళ్లు శాశ్వతంగా మార్చేశారని పేర్కొన్నారు.
Read Also: గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం
Follow Us On: Facebook

