కలం, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్ 2026లో అసలైన పోరు ప్రారంభమైంది. నాకౌట్ దశలో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా శనివారం మియామి వేదికగా సంచలన జట్టు ‘కేప్ వెర్డే'(Cape Verde)తో రౌండ్ ఆఫ్ 32లో తలపడనుంది. ఈ మ్యాచ్పై ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కతార్లో జరిగిన గత ప్రపంచకప్ను గెలుచుకున్న అర్జెంటీనా.. ఈ టోర్నీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది.
గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్లలోనూ విజయాలు సాధించి నాకౌట్కు అజేయంగా చేరిన జట్లలో ఒకటిగా నిలిచింది. అర్జెంటీనా కెప్టెన్ ‘లియోనెల్ మెస్సీ’ (Lionel Messi) అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. తన ఆరో ప్రపంచకప్ ఆడుతున్న 39 ఏళ్ల మెస్సీ గ్రూప్ దశలో మూడు మ్యాచ్లలోనే ఆరు గోల్స్ చేసి గోల్డెన్ బూట్ రేసులో ముందంజలో ఉన్నాడు. జోర్డాన్పై గోల్ చేయడంతో వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా మరో అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. 2023 నుంచి మియామిలోనే నివసిస్తుండటంతో ఈ వేదిక కూడా అతనికి బాగా సుపరిచితం.
మరోవైపు తొలి ప్రపంచకప్లోనే కేప్ వెర్డే సంచలన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా నాకౌట్కు చేరిన ఈ జట్టు మాజీ ప్రపంచ ఛాంపియన్లు స్పెయిన్, ఉరుగ్వేలను డ్రాగా నిలిపి తన సత్తా చాటింది. 40 ఏళ్ల అనుభవజ్ఞుడైన గోల్కీపర్ ‘వోజిన్హా’ ఈ టోర్నీలో జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ జూలై 4 శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభం కానుంది. రౌండ్ ఆఫ్ 16లో చోటు కోసం ఇరు జట్లు పోటీపడనున్నాయి. ఒకవైపు ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా.. మరోవైపు అంచనాలను తలకిందులు చేసిన కేప్ వెర్డే. దీంతో ఈ నాకౌట్ పోరు టోర్నీలో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటిగా నిలవనుంది.

