కలం, స్పోర్ట్స్ : 16 ఏళ్లుగా కొనసాగుతున్న 2009 ఐపీఎల్ ఫెమా కేసులో మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) కి భారీ ఊరట లభించింది. ట్రిబ్యునల్ తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్కు తిరిగి వస్తానని ప్రకటించాడు. 2009లో సాధారణ ఎన్నికల కారణంగా ఐపీఎల్ను దక్షిణాఫ్రికాకు తరలించిన నిర్ణయంపై ఈ కేసు నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేశారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది.
2011లో నోటీసులు జారీ చేసి, 2018లో లలిత్ మోదీతో పాటు అప్పటి బీసీసీఐ అధికారులపై జరిమానాలు విధించింది. ఆ నిర్ణయాలను లలిత్ మోదీ, ఇతర అధికారులు ట్రిబ్యునల్లో సవాల్ చేశారు. జూలై 16న వెలువడిన 105 పేజీల తీర్పులో ట్రిబ్యునల్ ఈడీ ఆరోపణల్లో ఎక్కువ భాగాన్ని తిరస్కరించింది. లలిత్ మోదీ ఫెమా ఉల్లంఘనలకు బాధ్యుడు కాదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. బీసీసీఐ ఫెమా నిబంధనల అమలు బాధ్యత ఆయనపై లేదని, ఆయనపై విధించిన జరిమానాలను కూడా రద్దు చేసింది.
అలాగే 2009 ఐపీఎల్కు సంబంధించిన విదేశీ నిధుల బదిలీలు కరెంట్ అకౌంట్ లావాదేవీలేనని పేర్కొంది. తీర్పుతో ఎంతో సంతోషంగా ఉన్నానని లలిత్ మోదీ వెల్లడించాడు. 16 ఏళ్లుగా తాను చెబుతున్న విషయమే ఇప్పుడు నిజమని తేలిందని తెలిపాడు. 2009లో తీసుకున్న నిర్ణయాలు ఐపీఎల్ ప్రయోజనాల కోసమేనని, ఎలాంటి వ్యక్తిగత తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశాడు.
ఈ కేసు ముగియడంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు లలిత్ మోదీ తెలిపాడు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో భారత్కు తిరిగి రావాలని భావిస్తున్నానని వెల్లడించాడు.

