కలం, ఖమ్మం బ్యూరో : హైదరాబాద్లో ఇటీవల దారుణంగా హత్యకు గురైన నర్స్ ఊకె శిరీష కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) ఆదివారం పరామర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగుడెం గ్రామంలోని శిరీష నివాసానికి వెళ్లిన ఆమె, బాధితురాలి తల్లి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన నిరుపేద గిరిజన యువతి శిరీషపై అంతటి దారుణానికి ఒడిగట్టడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి తమ పార్టీ పూర్తి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. శిరీషను అత్యంత కిరాతకంగా హత్య చేసిన దోషులను వెంటనే గుర్తించి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కవిత డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

