కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేధావుల వ్యాఖ్యలపై కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ఇద్దరే మేధావులు ఉన్నారంటూ రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. జీవితంలో ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని జైపాల్ రెడ్డి, కేశవరావు మేధావులా అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ రావు వంటి మహనీయులు రేవంత్ రెడ్డికి గుర్తుకు రాకపోవడం శోచనీయమన్నారు. చివరికి కాంగ్రెస్తో కలిసి ప్రయాణిస్తున్న కోదండరాం పేరును కూడా చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావమే పదవుల త్యాగంతో జరిగిందని కేటీఆర్ స్పష్టం చేశారు. 2006, 2008 లలో కేసీఆర్ రాజీనామాలు చేసిన సందర్భంలో జయశంకర్ సార్తో జరిగిన చర్చను ఆయన పంచుకున్నారు. ఉద్యమానికి మూడు దశలు ఉంటాయని, మొదటిది భావజాల వ్యాప్తి, రెండవది ఆందోళన పథం, మూడవది ఈ రెండూ కలిసి రాజకీయ శక్తిగా మారడమని సార్ వివరించేవారన్నారు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించాలన్నదే ఆయన సంకల్పమని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో ఎన్ని పార్టీలు వచ్చినా లక్ష్య సారూప్యత ముఖ్యమని ప్రతిపాదించిన గొప్ప మేధావి జయశంకర్ సార్ అని కొనియాడారు.

