కలం, వెబ్ డెస్క్: రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ కోసం ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేస్తున్నానంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ రైతులను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో 65 ఏళ్లలో కాంగ్రెస్ ఇవ్వలేని 24 గంటల కరెంట్ను 6 నెలల్లో కేసీఆర్ ఇచ్చి చూపించాడని కొనియాడారు.
రైతులకు యూరియా, రైతుబంధు ఇవ్వలేని రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ధాన్యం కొనలేని రేవంత్ రెడ్డి రైతు డిస్కం పెడతాడట అంటూ ఎద్దేవా చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. రేవంత్ రెడ్డికి రైతుల మీద అంత ప్రేమ ఉందని అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో 6,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని మంత్రి “బాంబులేటి” అబద్ధాలు చెప్పి రెండేండ్లు గడిచిపోయాయని మండిపడ్డారు. ఇప్పటివరకు ఆరు ఇండ్లు కూడా కట్టలేదని.. కనీసం ఆరు ఇటుకలు కూడా పెట్టలేదని దుయ్యబట్టారు.

