కలం, వెబ్డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పంటల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా మాత్రమే కాదు రైతుకు కూడా భరోసా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ధాన్యం, మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరవడం లేదని, ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు కేటాయించడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
ధాన్యం సేకరిస్తే రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. రైతుల ధాన్యం రోడ్ల మీద వానలకు తడిసిపోతుంటే రేవంత్ రెడ్డికి సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు.

