కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో జనాలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మల్కాజిగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉన్నాయని.. బీఆర్ఎస్ పాలనలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ సినిమాకు ఇంటర్వెల్ అయిపోయిందని.. ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ అయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం, రైతులకు రూ.15వేలు, పింఛన్ల పెంపు లాంటి అనేక హామీలను అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటి కార్డు కూడా ఇచ్చారన్నారు. ఇప్పటికి 900 రోజులు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

