కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని విద్యార్థుల పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకుడు తుంగ బాలు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ గత 30 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు.కేసీఆర్ ప్రభుత్వంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్ర విద్యా వ్యవస్థ.. నేడు కాంగ్రెస్ పాలనలో దిగజారిపోయిన స్థితికి చేరుకుందని ఆగ్రహించారు. విద్యా వ్యవస్థలో పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, ప్రణాళిక లోపించాయని అన్నారు.
రాష్ట్ర విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తన బాధ్యతను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా కొంపల్లి నరేష్ మాట్లాడుతూ.. నిర్వహణలో వచ్చే నెల జూలై 22వ తేదీన హైదరాబాద్లోని ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యారంగ పరిరక్షణ అంశాలపై రాష్ట్ర స్థాయి విద్యార్థి సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి నాయకులు, మేధావులు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపొతే విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

