కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ అధికారులు విచారించిన అనంతరం, తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాట్లాడారు.
ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. కేసీఆర్ గారిని సుమారు ఐదు గంటల పాటు సిట్ అధికారులు విచారించారని, అయితే ఈ సుదీర్ఘ విచారణలో కొత్తగా అడిగిన ప్రశ్నలేమీ లేవని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనే అంశంపైనే ప్రశ్నలు అడిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తాను కూడా విచారణకు హాజరైన అనుభవం ఉందన్న కేటీఆర్, అధికారులు కేవలం అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతూ సమయాన్ని వృథా చేశారని విమర్శించారు.
ఈ కేసులో మరోసారి విచారణకు పిలిచే అవకాశం లేదని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం రాజకీయ కక్షతో మళ్లీ పిలిచినా, తాము చట్టపరంగా ఎదుర్కోవడానికి, విచారణకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేవలం కాలాక్షేపం కోసమే ఇలాంటి విచారణలు సాగుతున్నాయని కేటీఆర్ (KTR) మండిపడ్డారు.


