కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ కథలో నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో కేటీఆర్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1956లో బలవంతంగా తెలంగాణ, ఆంధ్రాను కలిపింది కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. 1968 నుంచి 1971 వరకు తొలి తెలంగాణ ఉద్యమం జరిగితే.. 370 మంది తుపాకీ ఎక్కుపెట్టి బలి తీసుకుంది అదే పార్టీ అని మండిపడ్డారు.
1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలకు 11 స్థానాలు తెలంగాణ ప్రజా సమితి పార్టీకి ఇచ్చి.. మాకు తెలంగాణ కావాలనే ఆకాంక్షను ప్రజలు తెలియజేశారని, అయినా సరే ఆ ఉద్యమాన్ని కర్కశంగా అణచివేసింది నాటి కాంగ్రెస్ అధినాయకత్వం అని విమర్శించారు. మలిదశ ఉద్యమంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేది సామాన్యమైన నినాదం కాదని చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ వెంట నిల్చున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇవ్వక తప్పదు అనే పరిస్థితి కల్పించారని వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తప్ప.. తెలంగాణ మీద ప్రేమతో ఇవ్వలేదని ఆరోపించారు.

