కలం, వెబ్ డెస్క్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (Sanjay Kumar) అనర్హత పిటిషన్పై విచారణ సందర్భంగా నేడు స్పీకర్ ఆ పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యేను సాక్షాత్తూ సీఎం కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. ఫోటోలు, వీడియోలు కళ్ల ముందే కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ను తిరస్కరించడం అర్థరహితమన్నారు.
స్పీకర్ అటు సుప్రీం కోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాస్తున్నారని కేటీఆర్ (KTR) విమర్శించారు. గోడ దూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోకుండా సీఎం ఆదేశాల మేరకు నడుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని చెప్పారు. ఓవైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) దుమ్మెత్తిపోస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురుదెబ్బతో కోలుకోని కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు అంటేనే భయపడుతోందని అర్థమైపోయిందన్నారు.
మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నేపథ్యంలో సీఎం వైఫల్యాలు, మోసాలపై పట్టణ ప్రజల్లో పెద్దఎత్తున వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని చూసి రేవంత్ సర్కారు వణికిపోతోందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి రాహుల్గాంధీ మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఇక నుంచి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే నైతిక హక్కు లేదన్నారు. పట్టపగలే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని పేర్కొన్నారు.
Read Also: బెంగాల్లో SIR ప్రక్రియపై సుప్రీం కోర్టులో విచారణ
Follow Us On: Sharechat


