కలం, వెబ్ డెస్క్: మీనాక్షి నటరాజన్ అంటే కోపం ఉన్న కాంగ్రెస్ నాయకులే ఆమె కేసు గురించి మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు చెప్పి ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. బీజేపీలో ఎవరికీ ఫ్రెండ్స్ ఉన్నారో.. అందరికీ తెలుసన్నారు. చీటికిమాటికి సిట్ వేసే సీఎం రేవంత్ రెడ్డి.. మీనాక్షికి రాజ్యసభ సీటు దక్కకుండా చేసిన వారిని పట్టుకునేందుకు కూడా సిట్ వేయాలని సూచించారు. హైదరాబాద్ నగరాన్ని గాలికొదిలేసి ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నాడని మండిపడ్డారు. ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మాణాన్ని కావాలనే ఆపేయించాడని ఆరోపించారు. ఆ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే.. ఇప్పుడున్నంత ట్రాఫిక్ అసలే ఉండదని, చాలా వరకు తగ్గుతుందని స్పష్టం చేశారు.
అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు..
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య కచ్చితంగా పెంచాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్లో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జనాభా నియంత్రణలో మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రానికి తమ వాదనలు స్పష్టంగా వినిపిస్తూనే ఉన్నామని.. నిర్లక్ష్యం చేస్తే దక్షిణాది ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. జమిలి ఎన్నికలపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని.. మున్ముందో ఏం జరుగుతుందో చూడాలన్నారు.

