కలం, వెబ్ డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సొంత ఇలాకాలోని నేరెళ్ల బాధితులను స్వయంగా పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత (TRS Chief Kavitha) కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరెళ్ల ఘటన చూసి యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకుంటోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. ఈ దారుణం జరిగిన సమయంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వంలో తాను ఒక సభ్యురాలిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు తాను సిగ్గుతో తలదించుకుంటూ బాధితులకు క్షమాపణ కోరుతున్నట్లు కవిత (TRS Chief Kavitha) వెల్లడించారు. నేరెళ్ల ఘటనలో పోలీసులు ఎనిమిది మందిని అక్రమంగా నిర్బంధించి కొట్టారని ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, కేటీఆర్ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. తొమ్మిదేండ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో బాధితులకు ఇప్పటివరకు రూపాయి అందలేదని తెలిపారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదిలాఉంటే సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని 2017 జులై 2న తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్ల గ్రామానికి చెందిన రైతు బదనపు భూమయ్య మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు నేరెళ్ల వద్ద ఇసుక లారీలను తగులబెట్టారు. ఈ ఘటనలో 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గంధం గోపాల్ శనివారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ తరుణంలోనే అతని కుటుంబంతో పాటు బాధితులను పరామర్శించిన కవిత తాజా వ్యాఖ్యలు చేశారు.
Read Also: కాజీపేట డివిజన్ సాధించే వరకు పోరాటం ఆగదు: దాస్యం వినయ్ భాస్కర్
Follow Us On: Sharechat

