కలం, నాగార్జున సాగర్ : ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా నిలిచిన నల్లగొండ (Nalgonda) జిల్లా నాగార్జునసాగర్ (Nagarjuna Sagar)ను సోమవారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) చైర్మన్ సుబ్రమ్ష్ బిశ్వాస్(Subhrangshu Biswas) తన బృందంతో కలిసి సందర్శించారు. విజయవిహార్ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు నీటిపారుదల శాఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం నాగార్జునసాగర్ డ్యామ్ను పరిశీలించిన ఆయన, డ్యామ్ నిర్మాణం, గ్యాలరీలు, క్రస్ట్ గేట్లు, స్పిల్వే, ప్రధాన జల విద్యుత్ కేంద్రాల పనితీరును సమీక్షించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ వివరాలు తెలుసుకున్నారు.
ఇదే సందర్భంగా ‘స్వచ్ పక్షోత్సవం 2026’ కార్యక్రమంలో భాగంగా డ్యామ్పై స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించి, అధికారులు చీపురు పట్టి చెత్తను తొలగించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేఆర్ఎంబీ సభ్యులు జాగ్నింద్, పవన్నాథ్, ఎన్ఎస్పీఎస్ఈ మల్లికార్జున, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్ఐ శ్రీనివాస్, ఎస్ఐ రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.
డ్యాం భద్రతపై సమీక్ష
నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతపై కూడా కేఆర్ఎంబీ (KRMB) సభ్యులు ఆరా తీశారు. ప్రస్తుతం ప్రధాన డ్యామ్ వద్ద సీఆర్పీఎఫ్(CRPF) బలగాలు భద్రత నిర్వహిస్తుండగా, కంట్రోల్ రూం వద్ద కూడా కఠిన పహారా కొనసాగుతోంది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఎడమ ఎర్త్ డ్యామ్, గ్యాలరీలు, ఎడమ కాల్వ, ప్రధాన జలవిద్యుత్ కేంద్రాల వద్ద భద్రత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

