కలం, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)ను కలవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆదివారం మధ్యాహ్నం బెంగళూరులో ఖర్గేతో సురేఖ భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. కొండా సురేఖ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఖర్గేకు వివరించినట్లు తెలుస్తోంది. కూతురు వ్యాఖ్యలు, ఆ తర్వాత పరిణామాల గురించి ఆమె ఖర్గేకు వివరించారు. కొండా సురేఖ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల అపాయింట్ మెంట్ కోరినా ఎవరూ స్పందించకపోవడంతో నేరుగా ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా ఖర్గే సుస్మిత వ్యాఖ్యలపై ఆరా తీశారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడటం సరికాదని కొండా సురేఖకు సూచించారు.
కొండా సురేఖ బెంగళూరు పర్యటనలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్లో కొండా సురేఖ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు తారసపడ్డారు. ఈ క్రమంలో ఆమె బెంగళూరు పర్యటన గురించి రామచందర్ రావుతో చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు సురేఖకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ సమయంలో ఆమె ఖర్గేను కలవడం, బీజేపీ నేతలతో తన వ్యక్తిగత పర్యటన వివరాలు షేర్ చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

