కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యవహారంపై ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ లు వరుసగా భేటీ అవుతున్నారు. మంత్రి కొండా సురేఖపై వేటు తప్పదని , అందుకే ఆమెకు సైతం హస్తిన నుంచి పిలుపు వచ్చిందని.. దీంతో హుటాహుటిన ఆమె ఢిల్లీ బయలుదేరారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న కొండా సురేఖ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తనకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపురాలేదని, తాను వ్యక్తిగత పనుల మీద ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)ను కలవనున్నట్లు వెల్లడించారు. ఆమె ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ (KC Venugopal) తో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో కొండా సురేఖపై ఢిల్లీ పెద్దలు వేటు వేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ తాజా పరిణామం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ తరుణంలోనే కొండా సురేఖ(Konda Surekha)పై వేటు పడకపోవచ్చుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆమెకు ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు, ఒక అగ్రనేత మద్దతిస్తున్నట్లు రాజకీయా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : ఒంటి కాలితో బడికి.. యూపీ చిన్నారి వీడియో వైరల్!
Follow Us On : WhatsApp

