కలం, నిర్మల్: ఖానాపూర్ (Khanapur) ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి, ఆసుపత్రిలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bhojju Patel) తెలిపారు. బుధవారం ఆయన ఆసుపత్రిలో వైద్యులతో సమావేశం నిర్వహించి, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. ఆసుపత్రి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు సమావేశాలు నిర్వహించి సమస్యలను గుర్తించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా వైద్యుల నియామకం, సిబ్బంది కొరత, రోగుల అపాయింట్మెంట్లు తదితర అంశాలపై అధికారులతో చర్చించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆసుపత్రిలో ఇప్పటికే కొంతమంది వైద్యులు కొత్తగా నియమితులై విధుల్లో చేరారని, మిగిలిన ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రికి సంబంధించిన భూమి సమస్యలు, అంతర్గత మౌలిక వసతులు, మరమ్మతులు, విద్యుత్ కొరత వంటి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.
డయాగ్నస్టిక్ సెంటర్ అభివృద్ధికి సుమారు రూ.39 లక్షల నిధులు అవసరమని, ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రిని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

