కలం, కరీంనగర్: బీఆర్ఎస్ నేతల కేసీఆర్ కుటుంబ భూదాహాన్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి బయటపెడుతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దాన్ని వక్రీకరించి మాట్లాడడమేంటని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై అసెంబ్లీలో తీర్మానం చేసి సీబీఐ విచారణకు పంపిస్తే.. సంవత్సరమైనా ఎందుకు విచారణ ముందుకువెళ్లడం లేదన్నారు. బీఆర్ఎస్ తో సెట్టింగ్ వల్లేనా? ముందు దీనికి సమాధానం చెప్పండి అంటూ నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్తో బీజేపీ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు.
స్మార్ట్ సిటీ పనుల అవకతవకలపై ఆనాడు కాంగ్రెస్ పార్టీగా తరఫున తాము ఎంత మొత్తుకున్నా ఎంపీగా బండి సంజయ్ ఒక్క రోజైన స్పందించలేదని నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) దుయ్యబట్టారు. ఆనాటి నుండి బీఆర్ఎస్ తో ఉన్న సెట్టింగ్ వల్లనే బండి సంజయ్ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. కరీంనగర్ అభివృద్ధి నిధులన్నీ బీజేపీ తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేనట్టు బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టడం కాదని.. కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తీసుకురావాలన్నారు.
జిల్లాలో అభివృద్ధి పనుల విషయంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ జనరల్ ఫండ్ తో పాటు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినట్టు బీజేపీ నాయకులు భ్రమలు కల్పిస్తున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు. గణేష్ నిమజ్జనానికి నీటి విడుదలతో పాటు అన్ని ఏర్పాట్లు జరుగుతుంటే బీజేపీ, బీఆర్ఎస్ నీటి విడుదలపై వివాదం చేయాలని చూస్తుందని దుయ్యబట్టారు.
ఈ విలేకరుల సమావేశంలో కార్పోరేటర్లు పర్వతం మల్లేశం, జగన్ రెడ్డి, నాయకులు గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కల్వల రాంచంద్రం, దన్న సింగ్, మహాలక్ష్మి, ఆస్తపురం తిరుమల, రాజ్ కుమార్, మాసుం ఖాన్, అంజయ్య, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.

