తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించవద్దు : పీడీఎస్‌యూ

కలం, నల్లగొండ : తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేవలం ఒక మతపరమైన ఘర్షణగా చిత్రీకరించడం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమేనని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) స్పష్టం చేసింది. సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పేర్కొంటూ పీడీఎస్‌యూ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌జీ కాలేజీ ప్రాంగణంలో నల్లజెండాలతో నిరసన (PDSU Protest) తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె. పవన్ కుమార్ మాట్లాడారు.

1946–51 కాలంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వెట్టిచాకిరీ, భూస్వామ్యం, దోపిడీ, దేశ్‌ముఖ్‌ల అరాచకాలు, నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన విస్తృత ప్రజా ఉద్యమమని  గుర్తుచేశారు. విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి వంటి భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన భూహక్కుల పోరాటం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందన్నారు. 1948 సెప్టెంబర్‌లో ‘ఆపరేషన్ పోలో’ పేరుతో భారత సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారన్నారు.

అయితే ఆ సమయంలో సాగుతున్న రైతాంగ పోరాట సామాజిక, రాజకీయ నేపథ్యాన్ని విస్మరించకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చారిత్రక ఘట్టాన్ని కేవలం ‘హిందూ-ముస్లిం’ ఘర్షణగా చూపడం వెనుక ఉన్న మతోన్మాద రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని పవన్ కుమార్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17పై ‘విలీన దినం’, ‘విమోచన దినం’, ‘ప్రజా పాలన దినోత్సవం’ వంటి భిన్న కోణాలు ప్రచారంలో ఉన్నప్పటికీ, ఆధారాలతో కూడిన చారిత్రక చర్చ మాత్రమే ప్రజాస్వామ్యానికి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎస్‌యూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సైదులు, జిల్లా కార్యదర్శి ప్రవీణ్, నాయకులు చందు, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>