కలం, వెబ్ డెస్క్: సింగరేణి (Singareni) సంస్థలో రూ.1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనే వార్తలపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.51,500 కోట్లకు పైగా బకాయిలు కారణంగా సింగరేణి ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని పేర్కొన్నారు. 40 వేల మందికి పైగా ఉన్న సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమంతో పాటు సంస్థ భవిష్యత్తును కాపాడటం అందరి బాధ్యతని గుర్తు చేశారు.
అంతర్గత భద్రతను సమీక్షించాలి..
సింగరేణిలో చోటు చేసుకుంటున్న లోటుపాట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న భద్రతా వ్యవస్థలు, అంతర్గత పనితీరును తక్షణమే సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి భారీ అక్రమాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు. కాగా, ఇటీవల సింగరేణిలో బొగ్గు మాయం అయిందంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుండగా.. తాజాగా కేంద్ర మంత్రి లేఖ రాయడంతో సంస్థ కార్మికులతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Read Also: రేపు హైదరాబాద్కు కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు..!
Follow Us On : WhatsApp

