కలం, వెబ్ డెస్క్: ఆరోగ్య శ్రీ (Aarogyasri) క్రెడిట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికే ఇవ్వాలని మంత్రి సత్య కుమార్ (Minister Satya Kumar) అన్నారు. ఈ పథకం ఆయన హయాంలోనే వచ్చిందని, అయితే ఇది ప్రభుత్వ పథకమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకానికి భారతీ సిమెంట్స్ నుంచి నిధులు ఖర్చే చేయలేదని ఎద్దేవా చేశారు. ఆరోగ్య శ్రీ నిర్వీర్వ్యం అయిపోయిందంటూ ఫేక్ వార్తలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా ప్రవర్తించవద్దని వైసీపీ నాయకులకు సూచించారు. లబ్ధిదారుల సంఖ్య, నెట్ వర్క్ ఆస్పత్రుల సంఖ్య, దాని మీద పెడుతున్న ఖర్చు ప్రొసీజర్లు తగ్గితే నిర్వీర్యం అయిపోయినట్లని, కానీ, అలాంటిదేం జరగలేదని మంత్రి పేర్కొన్నారు.
నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య పెరుగుతోందని, ప్రొసీజర్లు అన్ని ఆస్పత్రుల్లో అందుతున్నాయని మంత్రి వెల్లడించారు. 2019- 2024 వరకు మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 41.2 లక్షలు ఉన్నట్లు తెలిపారు. జగన్ తన హయాంలో అన్ని పథకాలకు పేర్లు మార్చి వాడేశారని సత్య కుమార్ విమర్శించారు. గతంలో చంద్రన్న సంచార చికిత్స అని ఉన్న పథకాన్ని జగన్ అధికారంలోకి వచ్చాక ఫ్యామిలీ డాక్టర్గా మార్చారని చెప్పారు. పథకం ఏం మారలేదని, కేవలం పేరు మాత్రమే మారిందని తెలిపారు. ఇలాగే ఆరోగ్య శ్రీ పథకం పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందని, సేవలన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

