కలం, ఖమ్మం బ్యూరో: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాకు (Illegal Sand Smuggling) పాల్పడే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఖమ్మం రూరల్ ఏసీపీ (Khammam Rural ACP) తిరుపతి రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం ముదిగొండ మండలం రాష్ట్ర సరిహద్దులోని మల్కాపురం క్రాస్రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్టును ముదిగొండ సీఐ మురళితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల గుండా జరిగే అక్రమ ఇసుక రవాణాను పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు సరిహద్దు పోలీస్ స్టేషన్ల అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. అక్రమ రవాణాకు అవకాశం ఉన్న అన్ని మార్గాలపై నిరంతర నిఘా కొనసాగించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇసుకను తరలిస్తున్న లారీలను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు.
అక్రమంగా ఇసుకను రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్టప్రకారం కేసులు నమోదు చేసి, భారీ జరిమానాలు విధించడంతో పాటు సంబంధిత వాహనాలను జప్తు చేయాలని స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ పరిధిలోని సరిహద్దు చెక్పోస్టులలో పోలీసు సిబ్బంది మూడు షిఫ్టులలో 24 గంటల పాటు నిరంతరం విధులు నిర్వహిస్తూ అక్రమ రవాణాపై నిఘా ఉంచుతారని తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలలో ముదిగొండ సీఐ మురళితో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

