కలం, ఖమ్మం బ్యూరో: పోలీస్ స్టేషన్, కోర్టుల వాతావరణానికి దూరంగా, బాధితులకు ఎలాంటి భయం లేకుండా భరోసా కేంద్రాల్లో సాయం అందుతుందని ఖమ్మం (Khammam) అడిషనల్ డీసీపీ రామానుజం తెలిపారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం భరోసాపై సమన్వయ సమావేశం నిర్వహించగా అడిషనల్ డీసీపీ మాట్లాడారు. దగా పడిన మహిళలకు అండగా నిలవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల ద్వారా పోలీస్, వైద్య, న్యాయ, మానసిక కౌన్సెలింగ్ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చినట్లు తెలిపారు. వేధింపుల బారిన పడిన బాధితులకు మరోసారి అలా జరగకుండా చూడటమే భరోసా సంస్థ ముఖ్య లక్ష్యమన్నారు.
బాధిత మహిళలు, పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సతో పాటు సైకాలజిస్టుల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి మనోధైర్యాన్ని నింపుతారని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కోర్టు విచారణ పూర్తయ్యే వరకు న్యాయ నిపుణుల ద్వారా బాధితులకు ఉచిత న్యాయ సాయం అందేలా చూస్తామన్నారు. బాధితుల కోసం స్వల్పకాలిక ఆశ్రయం, చదువుకునే సౌకర్యం, స్వయం ఉపాధి శిక్షణ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేలా తోడ్పాటు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐసీపీఎస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కౌన్సిలర్లు మరియు దర్యాప్తు అధికారులు పాల్గొన్నారు.
Read Also: ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు: కిషన్ రెడ్డి
Follow Us On: Sharechat

