కలం ఖమ్మం బ్యూరో : పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజా(Chinese Manja)ను ఎవరైనా విక్రయించినా, వినియోగించినా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాతి పండుగ(Sankranti Festival) సమిపిస్తున్న వేళ యువత గాలి పటాలను(Kites) ఎగురవేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో యువత అధికంగా చైనా మాంజా ఉపయోగించి గాలి పటాలను ఎగుర వేయడం ఆసక్తి కనబరుస్తారు. కాని యువత వినియోగించే చైనా మాంజా ( సింథటిక్ దారం, గాజు పొడి) చాలా ప్రమాదకరమని, ఈ దారాన్ని ఉపయోగించడం ద్వారా పక్షుల గొంతు, రెక్కలు తెగిపోవడం, మనుషులకు గాయాలు కావడం జరుగుతుంది.ఎవరైనా చైనా మాంజా విక్రయించిన వినియోగించిన జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. చట్టవిరుద్ధమైన చైనా మాంజా నియంత్రణ కై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయాలకు పాల్పడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు తెలిపారు.


