కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) జేఏసీ సమ్మె నేపథ్యంలో ఖమ్మం (Khammam) నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఆర్టీసీ నూతన బస్టాండ్ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) సందర్శించారు. స్థానిక పరిస్థితులపై ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. బందోబస్త్లో ఉన్న పోలీస్, అధికారులు సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్టీసీ జేఏసీ కార్మికుల సమ్మె సందర్బంగా ప్రైవేట్ డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయిలో పోలీస్ రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ప్రజా రవాణా వ్యవస్థకు, ప్రభుత్వ అస్తులకు నష్టం కలిగించడం, ఆటంకాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టౌన్ ఏసీపీ రమణమూర్తిని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సమ్మె నేపథ్యంలో బస్సుల ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, కాబట్టి అత్యవసర పనులు ఉంటేనే ప్రయాణాలు చేయాలని సూచించారు. కాగా, ఆర్టీసీ పర్మినెంట్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం రెండో రోజు సమ్మె కొనసాగిస్తున్నారు.

