కలం, వెబ్ డెస్క్: నేపాల్-భారత్ (Nepal-India) సరిహద్దుల్లో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సత్సంబంధాలకు భిన్నంగా నేపాల్ ప్రభుత్వం తాజాగా కఠిన కస్టమ్స్ నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రజలకు నిత్యావసర వస్తువులైన బియ్యం, చక్కెర, నూనెతో పాటు కూల్ డ్రింక్స్, అరటిపళ్లను కూడా భారత్ నుంచి తీసుకొచ్చేందుకు అనుమతించడం లేదు. నేపాల్ సరిహద్దుల్లోనే పోలీసులు వీటిని అడ్డుకుంటున్నారు. రూ.100 విలువైన వస్తువులపై కూడా సుంకాలు విధిస్తూ, సామాన్యుల వద్ద ఉన్న చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్లను సైతం స్వాధీనం చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ కొత్త రూల్స్పై సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు భారతీయ వాహనాలపై కూడా నేపాల్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. భారతీయ వాహనాలు నేపాల్లోకి ప్రవేశించాలంటే ఇకపై రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా నిబంధన తీసుకొచ్చింది. అలాగే నేపాల్లో ఉండే గడువును 30 రోజులకు పరిమితం చేస్తూ రోజూవారీ చార్జీలు వసూలు చేస్తోంది. సరైన అనుమతులు లేని వాహనాలను శాశ్వతంగా జప్తు చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల బీహార్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని వేలాది మంది భారతీయ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న ప్రజా సంబంధాలను ప్రభావితం చేస్తున్న ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

