కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలో రానున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్లో ఆయన మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వరద ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా టాస్క్ ఫోర్స్ బృందాలతో నిరంతర నిఘా ఉంచినట్లు సీపీ తెలిపారు.
నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేసే దళారులు, ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తక్కువ ధరల ఆశకు లోనై గుర్తుతెలియని వ్యక్తుల వద్ద విత్తనాలు కొని మోసపోవద్దని రైతులకు సూచించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

