కలం, వెబ్ డెస్క్: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి జల వివాదం (Cauvery Water Dispute) నెలకొన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై చర్చించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. సీఎం డీకే శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ సీఎంలు సిద్ధరామయ్య, యడియూరప్ప, కేంద్ర మంత్రి హెచ్.డి.కుమార స్వామి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. కావేరి అంశంలో ఎలా ముందుకెళ్లాలో అందరి అభిప్రాయాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశం అనంతరం డీకే శివ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారని సీఎంవో తెలిపింది.
మేకధాతు డ్యాం ప్రతిపాదనతో..
కర్ణాటకలోని కావేరి నదిపై రామనగర జిల్లా మేకధాతు అనే ప్రాంతం వద్ద డ్యాం నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతం తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉంటుంది. ఈ జలాశయం నిర్మిస్తే భవిష్యత్తులో తమకు నీటి ఇబ్బందులు వస్తాయని తమిళనాడు అభ్యంతరం చెబుతోంది. బెంగళూరు నీటి అవసరాల కోసమే డ్యాం నిర్మాణం చేపడుతున్నట్లు కర్ణాటక వాదిస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. తానే స్వయంగా కర్ణాటకకు వచ్చి చర్చిస్తానని తమిళనాడు సీఎం విజయ్ కోరినా.. ప్రస్తుత ఆందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించింది.
సీఎం విజయ్కు బీజేపీ అధ్యక్షుడి లేఖ..
కావేరి అంశంలో కర్ణాటక అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని తమిళనాడు సీఎం విజయ్ను కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర లేఖ రాశారు. కర్ణాటక పట్ల సానుభూతితో వ్యవహరించాలని, రాజనీతిజ్ఞత ప్రదర్శించాలని సూచించారు. బెంగళూరు నగరానికి తీవ్రమైన నీటి కష్టాలు వస్తున్నాయని.. మేకధాతు డ్యాం నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని.. కావేరి నది కర్ణాటక, తమిళనాడు ప్రజలను కలిపి ఉంచాలి తప్ప, విడదీసేలా చేయొద్దని వ్యాఖ్యానించారు.

