కలం, నల్లగొండ: తెలంగాణ శాసన మండలికి చెందిన ‘ప్రభుత్వ హామీల కమిటీ’ (2026–27) చైర్మన్గా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ (Shankar Naik) బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలిలో నిర్వహించిన కమిటీ ప్రాథమిక సమావేశానికి ఆయన చైర్మన్ హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ భవిష్యత్ కార్యకలాపాలు, వివిధ ప్రభుత్వ హామీల అమలు తీరుపై సభ్యులతో విస్తృతంగా చర్చించారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేరేలా కమిటీ ద్వారా సమర్థవంతంగా పర్యవేక్షిస్తామన్నారు. హామీల అమలు ప్రక్రియలో వేగం పెంచేందుకు శ్రమిస్తామని స్పష్టం చేశారు. కీలక బాధ్యతలు చేపట్టిన శంకర్ నాయక్కు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, కమిటీ సభ్యులు, లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

