కలం, వెబ్ డెస్క్: కేరళ(Kerala)లోని కోజికోడ్లో ఓ బామ్మ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిని నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎరంజిప్పాలం ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఫుట్పాత్(Footpath)పై స్కూటర్ నడుపుతున్న ఓ వ్యక్తిని ఆ బామ్మ గట్టిగా వారించి ఆపింది. ఇది నడిచే వాళ్ల కోసం.. వాహనాలు రోడ్డుపైనే వెళ్లాలంటూ స్పష్టంగా చెప్పింది. అయినా ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లలేదు. ఇంకా ముందుకు వెళ్లేందుకే ప్రయత్నించాడు. మరి ఆ బామ్మ ఊరుకుందా… ఇంకా మున్ముందుకు వెళ్తూ ధైర్యంగా అలాగే నిలబడింది.
ఇలా కొంతసేపు బామ్మతో పాటు సదరు వ్యక్తికి చిన్నపాటి వాగ్వాదమే జరిగింది. ఆమె మరింత ధైర్యంగా ప్రతిఘటించడంతో స్కూటర్పై ఉన్న వ్యక్తి చేసేదేం లేక వెనక్కి వెళ్లి రోడ్డుపైనే వెళ్లాల్సి వచ్చింది. ఈ వీడియోను అక్కడున్న వారు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో క్షణాల్లో వైరల్గా మారింది. నెటిజన్లు ఆ బామ్మ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఆమె లాంటి వాళ్లు కొంతమంది ఉంటే చాలు అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి హింసాత్మకంగా ప్రవర్తిస్తే ఆమెకు ప్రమాదం జరిగి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆమెలాగా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి తప్పులను ప్రశ్నించాలని సూచిస్తున్నారు.
ఇక బామ్మ ధైర్యానికి కేరళ రాష్ట్రంలోని అధికారులు కూడా ఫిదా అయ్యారు. ఫుట్పాత్పై వాహనం నడిపిన వ్యక్తిని ధైర్యంగా ఎదిరించినందుకు ఆమెను ప్రత్యేకంగా కలిసి సన్మానించారు. సోషల్ మీడియాలో బామ్మ వీడియో వైరల్ కావడంతో మోటార్ వెహికిల్ డిపార్ట్మెంట్ అధికారులు శుక్రవారం బామ్మను ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు.

Read Also: పెళ్లి రూమర్లపై మృణాల్ సెటైర్లు
Follow Us On: Pinterest


