కలం, వెబ్ డెస్క్: బసవేశ్వరుని జయంతి (Basaveshwara Jayanti) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఘన నివాళులర్పించారు. సబ్బండ వర్గాల శ్రేయస్సు కోసం కృషిచేయడమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. భారత సామాజిక న్యాయ దార్శనికుడు, మానవతావాది, బసవేశ్వరుని జయంతి సందర్భంగా వారు దేశానికి అందించిన మార్గదర్శకత్వం, సామాజిక కృషినిఆయన స్మరించుకున్నారు. కులం, వర్ణం,లింగం రూపంలో దేశంలో కొనసాగుతున్న వివక్షాపూరిత, అమానవీయ మానవ సంబంధాలు రద్దుకావాలని, సమానత్వ భావన ఫరిడవిల్లాలని, పోరాడిన మానవతావాది, సంఘ సంస్కర్త బసవేశ్వరుడు అని కొనియాడారు. తన సాహిత్యం ద్వారా, సమాజంలో అవగాహన, సంస్కరణలకు బాటలు వేసి, సామాజిక న్యాయం, సమానత్వం, శ్రమకు గౌరవం అనే మహత్తర సూత్రాలను ప్రతిపాదించారని తెలిపారు. ఎనిమిది దశాబ్దాల క్రితమే అమలుచేసిన వారి దార్శనిక కార్యాచరణ నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నదని తెలిపారు.
త్యాగాలతో సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రంలో తొలి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బసవేశ్వరుని స్ఫూర్తితో అమలుచేసిన ప్రగతి కార్యాచరణ, దళిత బహుజన సమాజాల జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేసిందని కేసీఆర్ తెలిపారు. తద్వారా సబ్బండ కులాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి, వారి ఆత్మ గౌరవాన్ని ద్విగుణీకృతం చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడి బోధనలను అనుసరించి సమానత్వం, మానవతా విలువలను కాపాడే దిశగా కృషి చేయాలని కోరారు. బలహీనవర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడం అనే ప్రాధాన్యతలతో పాలన కొనసాగించడం ద్వారానే బసవేశ్వరునికి మనం అందించే ఘన నివాళి అని స్పష్టం చేశారు.

